గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
శంకరపల్లి బీడీఎల్ రహదారి దారుణస్థితి
- వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు
- వాహనదారులు తీవ్ర ఇబ్బందులు
- ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు
- రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు
- ప్రతిరోజూ వందలాది ప్రయాణాలు
- కానీ రహదారి విస్తారంగా దెబ్బతినడంతో ప్రాణాలకు ముప్పు
శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ నుంచి బీడీఎల్ వరకు వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా మారి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రభావంతో రహదారి పలు చోట్ల పూర్తిగా దెబ్బతింది. రోడ్డు మధ్యలో లోతైన గుంతలు ఏర్పడటంతో చిన్న వాహనాలు ప్రయాణించడం కష్టసాధ్యమైపోగా, కొత్తగా ఈ మార్గంలో ప్రయాణించే వారికి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. రహదారి పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఇళ్లకు వచ్చి హామీలు ఇస్తున్నప్పటికీ, ప్రజలకు అవసరమైన రహదారి సమస్యపై ఎవరూ పట్టించుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. కొండకల్ – బీడీఎల్ రహదారి ప్రాంతానికి ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజూ వందలాది మంది ఈ రహదారి ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే రోడ్డు విస్తారంగా పాడైపోవడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
ప్రతిసారీ వర్షం పడితే రోడ్డు మరింత కష్టసాధ్యమైపోతోంది. గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. చాలా సార్లు ప్రమాదాలు తృటిలో తప్పించుకున్న సంఘటనలు కూడా జరిగాయి. అయినప్పటికీ అధికారులు కనీసం చూడరని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ నాయకులు ఇళ్ల వద్దకు వచ్చి ప్రజల మద్దతు కోరుతున్నారని, కానీ ఈ రహదారి సమస్యను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఓట్లు అడగడానికి ఇళ్లు తిరుగుతారు కానీ, ప్రజలకు అవసరమైన రోడ్లు సరిచేయడంలో మాత్రం ఎవరికీ ఆసక్తి ఉండదు అని వారు మండిపడ్డారు. ప్రజలు తక్షణమే అధికారులు స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని, ప్రమాదాలు జరగక ముందే తగిన చర్యలు తీసుకోవాలని గళమెత్తుతున్నారు.
Publisher
Namasthe Bharat
About The Author
Advertise

