Banglore –ఈరోడ్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు
బెంగళూరు నుంచి ఈరోడ్ వెళ్తున్న కుర్లా ఎక్స్ప్రెస్లో 24 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులు చేశాడు. బాధితురాలి కేకలతో అప్రమత్తమైన ప్రయాణికులు నిందితుణ్ని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు.
తమిళనాడు ఈరోడ్కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి ఈరోడ్కు వెళ్లే కుర్లా ఎక్స్ప్రెస్ రైల్లో రిజర్వ్ కంపార్ట్మెంట్లో ప్రయాణం ప్రారంభించింది.
బుధవారం ఉదయం రైలు ధర్మపురి సమీపంలో ఉండగా, ఒక వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అకస్మాత్తు దాడితో షాక్కి గురైన బాధితురాలు కేకలు వేయగా, తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. రైలు సేలం స్టేషన్ చేరుకున్న వెంటనే, రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో అతను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన 45 ఏళ్ల శంకర్ అని గుర్తించారు.
ఈ ఘటనపై సేలం రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, నిందితుడిని రిమాండ్కు తరలించారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైల్వే అధికారులు ఈ సందర్భంగా ప్రయాణికులను హెల్ప్లైన్ నంబర్ 139 ద్వారా ఎటువంటి అసౌకర్యం లేదా వేధింపులు జరిగినా తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు.
Publisher
Namasthe Bharat