కేపీహెచ్బీలో బీఆర్ఎస్వీ నాయకుడు హల్ చల్.!
అర్థరాత్రి మధ్యం మత్తులో యువతిని వేధించిన వైనం
ప్రశ్నించిన యువకుడిని హాస్టల్లోనికి వెళ్లి దాడి
హాస్టల్ కిటికీలు తలుపులు పగలగొట్టిన అన్నవరం అండ్ గ్యాంగ్
దాడికి పాలుపడిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కూకట్ పల్లి: కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో దౌర్జన్యానికి పాల్పడిన దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరంతో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు నంబర్ 3లోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్పై అర్థరాత్రి జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం, కేపీహెచ్బీ డివిజన్కు చెందిన బీఆర్ఎస్వీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం తన గ్యాంగ్తో కలిసి మద్యం మత్తులో హాస్టల్ సమీపంలో వెళ్తున్న ఒక యువతిని వేధించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వెంకటేష్ అనే యువకుడు వారిని అడ్డుకుని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించాడు. ఈ మాటలకు ఆగ్రహించిన గ్యాంగ్, వెంకటేష్పై దాడికి దిగింది.
ప్రాణభయంతో వెంకటేష్ సమీపంలోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్లోకి పారిపోయాడు. అయితే, అన్నవరం అండ్ గ్యాంగ్ అతడిని వదలకుండా హాస్టల్లోకి దూసుకెళ్లారు. కర్రలతో హాస్టల్ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి, ఆ తర్వాత వెంకటేష్పై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ అనూహ్య ఘటనతో హాస్టల్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగు తీశారు. రాత్రి చదువుకుంటుండగా ఒక్కసారిగా కిటికీలు పగులగొడుతున్న శబ్దం వినిపించింది. గ్యాంగ్ లోపలికి వచ్చి అల్లరి చేయడంతో ఒక్కసారిగా భయానికి గురయ్యామని హాస్టల్ విద్యార్థులు భయంతో చెప్పారు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం, అతని అనుచరులపై దాడి, ఆస్తి ధ్వంసం, హౌస్ట్రెస్పాస్, అసభ్యకర వ్యాఖ్యల వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకోగా.. మరి కొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదని, యువతులపై వేధింపులకు ఇదొక సంకేతమని, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
About The Author
Advertise

