బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తో ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి డాక్టర్ రమేష్
నమస్తే భారత్ :-తొర్రూరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తో కలిపి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి,బీసీ, ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలో విశ్రాంతి భవనం నుండి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ధర్నా చేపట్టారు. అనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ చందా మల్లయ్య తో కలిసి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించి బీసీల ఓట్లతో పీఠం ఎక్కి స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుండి 3 వేల కోట్ల రూపాయలు మార్చి లోగా విడుదలైతాయనే సాకుతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని ఎన్నికల్లో వెళ్తున్నారని అన్నారు.రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు.అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు కొద్ది రోజులోనే ఆమోదించుకున్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసని గత 78 సంవత్సరాల నుండి అణగారి పోతున్న చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా బడుగు బలహీన వర్గాల కు చెందిన కులాలు వారి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో చట్టబద్ధత కల్పించాలన్నారు.ఈ సమావేశంలో నాయకులు రాంపాక సుధాకర్ మహారాజ్, అన్నపురం వెంకన్న గౌడ్, సముద్రాల సోమయ్య, కొత్తూరు రమేష్, కొదునూరు సధాకర్,కుమారస్వామి,కస్తూరి పులేందర్, బౌరిశెట్టి అల్లా బాబు, డోనక ఐలయ్య,పుప్పాల మధుకర్,చిట్యాల శంకర్, కొండ యాకయ్య,ఎండి.మైపాషా, బొమ్మన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
