హైదరాబాద్లో ఐటీ రైడ్స్
హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. నగరంలోని ప్రముఖ హోటళ్లయిన పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు పత్రాలు పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్ల మొత్తం 50కిపైగా బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని బ్రాంచీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెహిఫిల్ రెస్టారెంట్ ఓనర్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్లు ఏటా వందల కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నాయి. దేశంలోని వివిధ నగరాలతోపాటు దుబాయ్లోనూ రెండు హోటళ్ల బ్రాంచీలు ఉన్నాయి. నిర్వహిస్తున్న వ్యాపారానికి, ఏటా సమర్పిస్తున్న ఐటీ రిటర్న్స్లో తేడాలు ఉండటంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇండ్లల్లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా శాలిబండలోని పిస్తా హౌస్ ప్రధాన బ్రాంచ్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం, ట్యాక్స్ చెల్లింపులో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పిస్తా హౌస్కి హైదరాబాద్లో 44 బ్రాంచీలు ఉండగా, మెహిఫిల్ రెస్టారెంట్కి 15 బ్రాంచీలు ఉన్నాయి.
