ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది.
1961, జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లన్న. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమై పోతున్నడమ్మ మనిషన్నవాడు’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అశువు కవిత్వ చెప్పడంలో దిట్ట అయిన అందెశ్రీ.. ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ప్రజలను ఉత్తేజితులను చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’తోపాటు ఎన్నో పాటలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కరం, లోక్నాయక్ పురస్కారం అందుకున్నారు.
