సర్పంచ్ రిజర్వేషన్ లో బీసీలకు తీవ్రమైన అన్యాయం
నమస్తే భారత్ :-తొర్రూరు
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని సామాజికవేత్త దొనికెన కుమారస్వామి అన్నారు.పట్టణ కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో బుధవారం బీసీ నాయకులు నిరసనను చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ సర్పంచుల రిజర్వేషన్ల ప్రక్రియ రాష్ట్రంలో అత్యంత లోపభూయిష్టంగా ఉందని,రొటేషన్ పద్ధతని, లొట్టపీసు పద్ధతని,వాని బొంద బొష్నాకులని కారణాలు చెప్పి బీసీలకు మొండి చేయి చూపి, బీసీలను ప్రభుత్వాలు బొంద పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయితీల్లో సర్పంచ్ పదవికి రిజర్వేషన్ పరంగా ఎస్టీలకు కేటాయిస్తున్నట్లుగా అధిక బీసీ జనాభా ఉన్న గ్రామ పంచాయితీల్లో కూడా సర్పంచుల స్థానాలు చట్టబద్ధంగా బీసీలకే కేటాయించే విధంగా మార్చాలని డిమాండ్ చేశారు.దాదాపు 150 కులాల భాగస్వామ్యం ఉన్న బీసీల్లో ఒక మండలంలో 40 గ్రామ పంచాయితీలు ఉంటే అందులో ఒకటో రెండో గ్రామ పంచాయితీలను బీసీలకు కేటాయిస్తే,150 కులాలకు ఏ విధంగా న్యాయం చేయలేమని, దీంతో చాలా బీసీ కులాలు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో బీసీలు వివిధ రంగాల్లో కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుందని అన్నారు.
జిల్లాలోని 482 గ్రామ పంచాయితీలకు గాను కేవలం 19 గ్రామ పంచాయితీలను అంటే 4 శాతం మాత్రమే బీసీలకు రిజర్వ్ చేశారని,42 శాతం మాటేమిటో గానీ కనీసం గతంలో ఉన్న 23 శాతం కూడా కేటాయించలేదని ఆయన తెలిపారు.జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఏ ఒక్క గ్రామ పంచాయితీ బీసీలకు రిజర్వేషన్ చేయలేదని,ఆయా మండలాల్లో "0" రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.46 ను, రిజర్వేషన్ షెడ్యూల్ ను, ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎలక్షన్లను నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అనపురం వెంకన్న, సముద్రాల సోమన్న, కొదునూరి సదాకర్, డొనక ఐలయ్య , మిట్టకోల లక్ష్మణ్, బౌరిశెట్టి అల్లా బాబు, గాదగాని రమేష్, బండారి మార్కండేయ, కస్తూరి పులేందర్, సూర యాకన్న, తదితరులు పాల్గొన్నారు.
