యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి

పోలీసుల విచక్షణ రహిత దాడిలో 50 మంది వడ్డెరలకు గాయాలు
జాతీయ వడ్డెర సంఘం పీట్ల శ్రీధర్ నేతృత్వంలో స్టేషన్ ముట్టడి
తెలంగాణ పత్రిక, హైదరాబాద్, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్తత తీవ్ర ఆందోళనకు దారితీసింది. స్థానికంగా రెండు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న గొడవ నేపథ్యంలో యడ్లపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లిన వడ్డెర ప్రజలు సుమారు 50 మందిపై పోలీసులు ఎలాంటి హెచ్చరిక లేకుండా విచక్షణ రహితంగా దాడికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. లాఠీచార్జ్ రూపంలో జరిగిన ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడటమే కాకుండా, లాఠీలు విరిగేలా కొట్టడంతో స్రృహ తప్పి కొంతమంది నేలపై పడిపోయినా కూడా ఆపకుండా దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సమాచారం హైదరాబాదులో ఉన్న జాతీయ అధ్యక్షులు వడ్డెర సంఘం పీట్ల శ్రీధర్ వరకు చేరగానే ఆయన అత్యవసరంగా స్పందించారు. వెంటనే సుమారు 100 మంది వడ్డెర నాయకులతో కలిసి అర్ధరాత్రి వేళ హుటాహుటిన యడ్లపాడు బయలుదేరి ఉదయం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ ఎదుట భారీ సంఖ్యలో జాతీయ, రాష్ట్ర నాయకులు గుమికూడడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పీట్ల శ్రీధర్, వల్లేపు శివకుమార్ లు మాట్లాడుతూ
“పోలీసులు ప్రజల రక్షకులు కానీ, వడ్డెరలపై ఇలా దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. బాధ్యులైన కానిస్టేబుళ్లను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని హెచ్చరించారు.
పీట్ల శ్రీధర్ తో పాటు వచ్చిన జాతీయ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపు శివకుమార్, పీట్ల మల్లేష్, జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, స్థానిక వడ్డెర ప్రతినిధులు కలిసి యడ్లపాడు ఎస్సై రామకృష్ణకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. మొత్తం సంఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు చేసి, గాయపడిన వడ్డెరలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలు కూడా సంఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లాఠీలు ఝళిపించిన తీరు, అనవసరంగా దాడికి దిగిన తీరు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో వైరల్ అవ్వడంతో ఈ ఘటనపై తీవ్రమైన చర్చ నెలకొంది. యడ్లపాడు పోలీసుల దౌర్జన్యంపై రాష్ట్రవ్యాప్తంగా వడ్డెర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఈ కేసు సుమోటోగా తీసుకుని, పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని యెడల దేశంలో నలుమూలల నుంచి వడ్డెర సమాజాన్ని ఏకం చేసి ఉద్యమం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, వడ్డెర సంఘం సభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
