అత్యుత్తమ పోలీస్స్టేషన్గా పెద్దకడుబూరు
జాతీయస్థాయిలో గుర్తింపు – రాష్ట్రంలోనే టాప్ గా నిలిచిన పోలీస్ స్టేషన్
కర్నూలు జనవరి 9( నమస్తే భారత్):-కర్నూలు జిల్లా పోలీస్శాఖకు గర్వకారణంగా పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ నిలిచింది. 2025 సంవత్సరానికి గాను రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్స్టేషన్గా పెద్దకడుబూరు ఎంపికై, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డును అందుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన పది పోలీస్స్టేషన్లలో ఒకటిగా నిలవడం విశేషం కాగా, రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక స్టేషన్ ఇదే కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
శుక్రవారం విజయవాడ మంగళగిరిలోని ఏపీ హెడ్క్వార్టర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఏ. మంజునాథ్, పెద్దకడుబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి అవార్డును స్వీకరించారు. డీజీపీ జిల్లా పోలీస్యంత్రాంగాన్ని అభినందిస్తూ, ఆధునిక సాంకేతికతను వినియోగించి లా అండ్ ఆర్డర్ను మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.
ఈ అవార్డు వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, నేరాల అదుపు, నేర నియంత్రణలో తీసుకున్న కఠిన చర్యలు, సీసీ కెమెరాల విస్తృత వినియోగం, కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయడం వంటి అంశాలు పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ను ముందువరుసలో నిలిపాయన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా సమర్థవంతమైన పర్యవేక్షణ, నిరంతర గస్తీ, నేరస్తులపై కఠిన చర్యలు చేపట్టడం ద్వారా పోలీస్స్టేషన్ విశ్వసనీయతను పెంచగలిగిందన్నారు.
పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ పరిధిలో నేరాల నివారణలో చూపిన చురుకుదనం, కేసుల పరిష్కారంలో సాధించిన వేగం, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించిన తీరు ఈ గుర్తింపుకు బలమైన పునాది అయ్యాయి. ఆధునిక సీసీ కెమెరాల వ్యవస్థతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా నేరాలను ముందుగానే గుర్తించి అడ్డుకునే విధానాలు ఫలితాన్నిచ్చాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈ విజయం ఒక్క వ్యక్తి కృషి ఫలితం కాదని, సమష్టి ప్రయత్నాల ద్వారానే సాధ్యమైందని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బంది అందరి సహకారంతోనే ఈ జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమైందన్నారు.
పెద్దకడుబూరు పోలీస్స్టేషన్కు లభించిన ఈ గౌరవం కర్నూలు జిల్లా పోలీస్శాఖ ప్రతిష్టను జాతీయ స్థాయిలో మరింత పెంచింది. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు డీఎస్పీ, కోసిగి సీఐ, పెద్దకడుబూరు ఎస్ఐతో పాటు సిబ్బందికి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా పోలీస్యంత్రాంగం అభినందనలు తెలిపారు. ఈ అవార్డు భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
