ఇజ్రాయెల్ దురాక్రమణను భారత్ ఖండించాలి : ఇరాన్
ఇరానియన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హొస్సేనీ మాట్లాడుతూ.. ‘భారత్ అధికారులతో మేము చర్చలు జరిపాం. ఇజ్రాయెల్-ఇరాన్ విషయంలో భారత్ తటస్థ వైఖరితో ఉంది. ఎందుకంటే రెండు దేశాలతోనూ భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఇరాన్-ఇజ్రాయెల్ సమస్యకాదు. ఒక దేశంపై దురాక్రమణకు సంబంధించిన విషయం. అంతర్జాతీయ చట్టం ప్రకారం దీన్ని ఖండించాలి. గ్లోబల్ సౌత్కు ఇండియా లీడర్. ఇజ్రాయెల్ దాడులను న్యూ ఢిల్లీ వ్యతిరేకించాలని ఇరాన్ ఆశిస్తోంది. భారత్తోపాటూ ప్రతి దేశం ఇజ్రాయెల్ దాడులను ఖండించాలి’ అని పేర్కొన్నారు.
మరోవైపు జ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో తమ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యుద్ధం వల్ల మూసి ఉంచిన ఇరాన్ గగనతలాన్ని భారత విమానాల కోసం తెరిచింది. ఇరాన్లో చిక్కుకుపోయిన మన విద్యార్థులు, పౌరుల కోసం కేంద్రం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. అందులో భాగంగా సుమారు 1000 మందిని మూడు విమానాల ద్వారా భారత్కు తీసుకు వస్తున్నారు. అందులో మొదటి విమానం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ఇరాన్ నుంచి రావాలనుకున్న మన వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు .
