జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ వినతి
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించండి: టిడబ్ల్యూజేఎఫ్
మేడ్చల్/ కుత్బుల్లాపూర్
(ప్రతినిధి) మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా టీడబ్ల్యూజెఎఫ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కట్టెల మల్లేష్, గడ్డమీది అశోక్ లు మాట్లాడుతూ... మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్లస్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారికి వెంటనే హెల్త్ కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
వయస్సు పైబడిన సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలన్నారు.
విద్యాశాఖ అధికారులు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య అందించాలని తెలిపారు. చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ఎమ్
ప్యానల్ మెంట్లో చేర్చాలి, వ్యాపార ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ సౌకర్యాలు కల్పించాలని వివరించారు.
రాష్ట్రంలో జిల్లాల్లో మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. పై సమస్యలపై మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్పందించి మా పరిధిలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మిగతా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జగదీశ్వర్ గుప్తా,
టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కావలి మోహన్, సహాయ కార్యదర్శి పి.శంకర్, చిన్న బాబు, రహీం ఖాద్రి, రమేష్, కొండల్ రెడ్డి, పర్వీజ్ అహ్మద్, డి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
