జిల్లాలో చిన్ననీటి వనరుల గణనను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్కను అత్యంత పకడ్బందీగా, శాస్త్రీయంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులుకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దేశవ్యాప్తంగా ఐదేళ్లకొకసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్ – రెండవ వాటర్బాడీస్ సెన్సస్ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల గణనను సమగ్ర ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా 2000 హెక్టార్లలోపు విస్తీర్ణం గల జలవనరుల గణనను మొబైల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ముందుగా ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని నమూనా గణన పూర్తిచేసిన అనంతరం మిగతా గ్రామాల్లో గణన కొనసాగించాలని సూచించారు.
గ్రామ స్థాయిలో GPOలు AEO లు TA లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు లను ఎన్యూమరేటర్లుగా పనిచేస్తారని, మండల స్థాయిలో AE విద్యుత్ శాఖ AE irrigation శాఖ పంచాయతీ సెక్రటరీలు, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖ MAO లు ఎంపీడీవోలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో చిన్న నీటి వనరుల గణన కోసం అవసరమైతే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లను కూడా ఎన్యూమరేటర్లుగా వినియోగించాలని ఆయన సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు, లిఫ్ట్ ఇరిగేషన్ నీటి నిల్వ ప్రాంతాలు, బోర్వెల్ కు సంబంధించిన జలవనరులు సహా ప్రతీ నీటి వనరుకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరణ అనివార్యమని ఆయన పేర్కొన్నారు.
గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ఎన్యూమరేటర్లకు జిల్లా మరియు మండల స్థాయిలో తక్షణ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, మొబైల్ యాప్ వినియోగం, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరణ, వంటి అంశాల్లో స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల పరిధిలో చార్జి ఆఫీసర్స్ అయిన తాసిల్దార్లు, ఎంపీడీవోలు మండల స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించి అవసరమైన సమాచారాన్ని సేకరించి గణన పనులపై సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రతి నీటి వనరు భవిష్యత్తు సాగునీటి ప్రణాళికలకు, నీటి సంరక్షణ చర్యలకు ముఖ్య ఆధారమని, అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి గణనను ఖచ్చితమైన సమాచారం మరియు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.
ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, సి పి ఓ సంజీవ రావు, భూగర్భ జలాల అభివృద్ధి శాఖ అధికారి రమేష్, ఇరిగేషన్ EE అర్జున్, పంచాయతీరాజ్ EE, శ్రీనివాస్ ,MPSO లు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
