ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలి
----ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారికే కేటాయించాలి.
----- ప్రతినెల చివరి వారంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి.
------- ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
ఎస్సీ,ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతీ నెల చివరి వారంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.బుధవారం నారాయణపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, భూ సమస్యలు, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.
రాష్ట్రంలో దళితలపై అణిచివేత, అసమానత్వం,అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కమిషన్ నిరంతరం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో పెండింగ్ గా ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. .అన్ని రకాల పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా రెండు గ్లాస్ ల పద్దతి, కుల వివక్ష ఉన్నందున విచారం వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతీ నెల చివరి వారంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. కార్యక్రమాన్ని మమ అనిపించకుండా ఎస్ఐలు, తహసీల్దార్లు సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. గతంలో మూడ్ మల్ ( మక్తల్) గ్రామంలో ఓ పూజారి దళితుల పట్ల వివక్ష తో ఆలయ ప్రవేశం కల్పించకపోవడంపై అందిన ఫిర్యాదుతో స్వయంగా తానే వచ్చి దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన సంఘటనను ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం,రాజీవ్ యువ వికాసం పథకాలలో ఎస్సీ,ఎస్టీ కోటా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అమలు పరచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పడకుండా చూడాలని తెలిపారు. నిధుల దుర్వినియోగం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సి,ఎస్టి సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, కులాంతర వివాహాలు, అంబేద్కర్ విద్యా తదితర పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా ఎస్సీ,ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డి.వి.యం.సి)వెంటనే ఏర్పాటు చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ , ఎస్సీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు, రెసిడెన్షియల్ పాఠశాలల వివరాలు వంటి జిల్లా ప్రొఫైల్ను వివరించారు. జిల్లాస్థాయిలో వసతి గృహాల నిర్వహణ,విద్యా, వైద్యం అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని,ఎస్సీ,ఎస్టీ కేసుల పరిష్కారం తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి మాట్లాడుతూ.. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. కులాంతర వివాహాల క్రింద 8 జంటలకు రూ 2.50 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించామని తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే మిగతా వారికి ప్రోత్సాహకం అందించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టి కోటా ప్రకారం మంజూరు చేయాలని కమీషన్ చైర్మన్ పేర్కొన్నారు.
డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. 2023 లో మొత్తం 31 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా,వాటిలో అన్ని కేసులకు ఛార్జీ షీట్ ఫైల్ చేయడం జరిగిందని, ఆ కేసులకు గాను రూ.14 లక్షల నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. 2024 లో 34 కేసులు నమోదు కాగా వాటిలో ఒక కేసు విచారణలో ఉందని, మిగతా వాటికి ఛార్జీ షీట్ దాఖలు చేశామని అందుకు గాను రూ. 20.50 లక్షల నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. ఇక ఈ సంవత్సరం 2025 లో ఇప్పటి వరకు 9 కేసులు నమోదు కాగా వాటిలో 3 ట్రయల్ లో ఉన్నాయని, మిగతా 6 విచారణ కొనసాగుతోందని, వాటికి గాను రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించడం జరిగిందని డిఎస్పి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో నిందితులకు శిక్ష పడేలా బలమైన సాక్షాలను ప్రవేశ పెట్టాలని శిక్ష పడకపోతే సంబంధిత అధికారుల శ్రమ అంతా వృథా అవుతుందని కమీషన్ చైర్మన్ చెప్పారు. ఎస్సీ ఎస్టీ కేసులలో బాధితులకు అందించే నష్టపరిహారం విషయంలో జిల్లాకు ఇంకా ఎంత బడ్జెట్ రావాలో తెలిపితే తాను సి.ఎస్ ను సంప్రదించి మంజూరు చేయిస్తానని తెలిపారం సమీక్షలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతు బీమా పథకం కింద 1052 మంది ఎస్సీ బాధిత కుటుంబాల ఖాతాల్లో రూ. 52.60 కోట్లు జమ చేయడం జరిగిందని, 245 మంది ఎస్టీ బాధిత కుటుంబాలకు రూ. 12.25 కోట్లను జమ చేసినట్టు తెలిపారు. అలాగే రైతు భరోసా పథకం కింద 24,521 మంది ఎస్సీలకు రూ. 27.31 కోట్లను, 10,079 మంది ఎస్టీలకు రూ.11.31 కోట్లను వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. ఇక రైతు రుణమాఫీ కింద 4770 మంది ఎస్సీ రైతులకి రూ.36.93 కోట్లు, 3121 మంది ఎస్టీ రైతులకు రూ. 25.44 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని ఆయన వివరించారు. సి.పి. ఓ యోగానంద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలను వెల్లడించగా, వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ అధికారులు, ఉద్యోగుల వివరాలను అధికారులు తెలిపారు. చివరగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి పోలీసు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని, కమీషన్ చైర్మన్ సూచించిన సలహాలు, సూచనలను తప్పక పాటిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ మాట్లాడుతూ.. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు రావడం, సమీక్ష జరపడం సంతోషంగా ఉందని, చైర్మన్ సూచనలు, సలహాలతో తాము ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాధితుల సమస్యల పై వినతి పత్రాలను స్వీకరించారు. కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ,నీలా దేవి, రాంబాబు నాయక్,రెణికుంట్ల ప్రవీణ్, ఆర్డిఓ రామచంద్రనాయక్, జెడ్పి సీఈవో శైలేష్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, డిఆర్డిఏ మొగులప్ప, డీ టి డబ్ల్యు ఓ జనార్ధన్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,కుల సంఘ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

