ఊట్కూర్ పీ హెచ్ సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
ఉట్కూర్ మండలం / నమస్తే భారత్
ఊట్కూరు కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు ఎవరెవరు విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు, స్టాఫ్, మందుల సరఫరా తదితర విషయాలపై ఆరా తీశారు. సెప్టెంబర్ లో 9, గత నెలలో 6 ప్రసవాలు జరిగాయని వైద్య సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఆస్పత్రి పరిధిలో ఉన్న సబ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయని, టీబీ పరీక్షల నిర్వహణ ఎలా ఉందని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రసవాల గదికి తలుపు లేకపోవడం గమనించిన కలెక్టర్ వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చూసుకోవాలని, అజాగ్రత్త, అలసత్వం వద్దని సున్నితంగా హెచ్చరించారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న
పాత పీ హెచ్ సీ భవనాన్ని చూసిన కలెక్టర్ భవన నాణ్యత ను ఆర్ అండ్ బి, పంచాయత్ అధికారులతో ధ్రువీకరింపజేసి ఆ భవనాన్ని కూల్చి వేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రామచంద్రనాయక్, తహాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎంపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
